#raitunestham #healthy #food #drkhadervali #millets #helthtips #Dr. Sarala - Dr. Khadervali
గతి తప్పిన జీవన విధానాలు.. పోషక విలువలు లేని ఆహారం... నిత్యం ఒత్తిడితో ప్రయాణం... వెరసి అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో 50 ఏళ్లకు పైబడిన వారికి వచ్చిన బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు... నేడు 20 ఏళ్ల పిల్లలకూ వస్తున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే .. భవిష్యత్తు మరింత అధ్వాన్నంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య సాధనపై అవగాహన కల్పిస్తోన్న రైతునేస్తం ఫౌండేషన్... 2024 జూలై 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు... సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ మరియు ఆయన కూతురు డాక్టర్ సరళ గారి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన జీవనశైలి, తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించడం జరిగింది. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆరోగ్య ప్రేమికుల నుంచి అపూర్వ స్పందన లభించింది.
కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు ఆహారం, ఆరోగ్యం, కషాయాలు, వ్యాయామాల ప్రాముఖ్యత తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ సరళ, మన్నవ పూర్ణయ్య, కొప్రాటి నాగేశ్వరరావు, పత్తి భవన్నారాయణ, నాగిశెట్టి నాగరాజు, గింజుపల్లి వేంకటేశ్వరరావు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానిదే భవిష్యత్ అని స్పష్టం చేసిన శాసనసభ్యులు బూర్ల రాంజనేయులు..... సహజ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలనే ప్రజలు వినియోగించాలని సూచించారు....
పూర్వీకుల ఆహార ధాన్యాలైన కొర్రలు, అండు కొర్రలు, ఆరికెలు, సామలు, ఊదలను వదిలి... ఆధునిక పోకడలతో వరి, గోధుములపై వైపు మళ్లడం వల్లే ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయని.. డాక్టర్ సరళ తెలిపారు. కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలన్నా... ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా... సిరిధాన్యాల వినియోగమే ఉత్తమ మార్గమని తెలిపారు...
కార్యక్రమంలో భాగంగా రెండో రోజు... యోగ సాధనపై డాక్టర్ సరళ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. ప్రతి రోజు ఆచరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వ్యాధుల నియంత్రణలో యోగా పాత్రను తెలియజేశారు. శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు. ఉదయపు నడకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులు, ప్రయోజనాలను వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ లో నిర్వహణలో ఉన్న వివిధ రకాల వ్యవసాయ, అనుబంధ రంగాల యూనిట్లను కార్యక్రమానికి హాజరైన ఔత్సాహికులు సందర్శించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యకర జీవనశైలిపై డాక్టర్ సరళ అవగాహన కల్పించారు. సిరిధాన్యాలు, కషాయాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.....
సిరిధాన్యాలతో జీవన సిరి కార్యక్రమంలో మూడో రోజు డాక్టర్ ఖాదర్ వలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గుండె పోటు, కిడ్నీ వైఫల్యం, కాన్యర్ తదితర ప్రమాదాకర వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగడం ఆందోళనకరమన్నారు. ఆహార, జీవన విధానంలో సమతుల్యత లోపించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని... ఇప్పటికైనా మేల్కొని జీవనశైలిని మార్చుకోవాలని సూచించారు. సిరిధాన్యాలు, కషాయాలను జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. డాక్టర్ సరళ, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు...
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. డాక్టర్ ఖాదర్ వలి మరియు డాక్టర్ సరళ గారి ద్వారా నిర్వహించిన సిరిధాన్యాలతో జీవన సిరి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆరోగ్య ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా జీవనశైలి, ఆహారం, ఆరోగ్యంపై అనేక విషయాలు తెలుసుకున్నామని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
16 окт 2024