సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డలో కొలువైన శ్రీశాల్మలీకంద శ్రీఆదివారాహ, శ్రీలక్ష్మీనర్సింహ, శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం ఆధ్యాత్మి క శోభతో విరాజిల్లుతోంది. భృగు మహర్షి నడయాడిన నేల. భృగుమహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడంతో బూరుగడ్డగా ఈ ప్రాంతం వాసికెక్కింది. ఒకే పీఠంపై శ్రీమహా విష్ణువు అవతార స్వరూపాలైన ఆదివరహా స్వామి,నరసింహస్వామి, శ్రీకృష్ణుడు ప్రధాన దైవాలుగా పూజాభిషేకాలు అందుకోవడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అరుదైన క్షేత్రంగా ‘బూరుగు గడ్డ’ దర్శనమిస్తుంది. సూర్యాపేట జిల్లా .. హుజూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ప్రధాన ద్వారానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన హనుమంతుడు కొలువై ఉంటాడు. ఆ స్వామికి నమస్కరించుకుని ప్రధాన మంటపంలోకి అడుగుపెట్టవలసి ఉంటుంది. ఈ మంటపానికి ‘అనంతమంటపం’ అని పేరు. మంటపంలో ఎడమవైపున 24 అడుగుల పొడవైన ‘అనంతపద్మనాభస్వామి‘ శిలా రూపం దర్శనమిస్తుంది. ఇది ఏకశిల.గర్భాలయంలో ఒక వైపున వేణుగోపాలస్వామి .. మరో వైపున లక్ష్మీ నరసింహస్వామి.మధ్యలో భూదేవి సమేతుడైన ఆదివారాహస్వామి దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలోని మూర్తులన్నీకూడా నలుపు .తేనె రంగు కలిసి రాతిలో మలచబడ్డాయి.