గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
కష్టజీవులు శేషయ్య-లక్ష్మి గార్ల దంపతులు. వారి అన్యోన్యత ఆదర్శవంతం.ఉపాధి నిమిత్తం మూడు దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లా దోర్నాల నుండి విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. కాయకష్టం చేసి తమ పిల్లలకు ఉన్నత విద్యాబుద్ధులు నేర్పి మంచి భవిత చూపారు.ఐదేళ్ల క్రితం విజయవాడ భవానీపురం లారీస్టాండ్ వద్ద వెంగమాంబ రాగి సంగటి హోటల్ పేరిట ఆహారశాల ప్రారంభించి తమదైన శైలిలో ఆహారం వండి వడ్డిస్తూ గుర్తింపు పొందారు.ఉడకబెట్టిన బెండకాయలు, రాములక్కాయ అంటే టమోటా,మిరపకాయలు,చేరిన ఉప్పు చూస్తే నోరూరిపోయింది. ఈ రోటి పచ్చడి సంగటికేనా.. అట్టు ముక్కకి, వేడివేడి అన్నానికి జతచేస్తే రోట్లో పచ్చడి నోట్లో రుచితో చిందాడాల్సిందే.మజ్జిగ బువ్వ జుర్రున్నాక నాలుక రాస్తే ఇక ఊహించుకోండి మీరే.రాగులను కొనుగోలు చేసుకుని పిండి పట్టించుకుంటారు. మంచి బియ్యాన్ని ఉపయోగిస్తారు.అంతిమంగా వెన్నపూసలా కరికిపోయే కమ్మని రాగి సంగటి సిద్ధం చేస్తారు.ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కిచిడి లేక పలావ్ మరియు తలకాయకూర ఇక్కడ చాలా బాగుంటుంది అట.శేషయ్య గారు చేదోడుగా ఉండగా లక్ష్మి గారు అన్ని వంటకాలను సిద్ధం చేస్తారు.తమ వద్ద బువ్వ తిన్నవారికి బొజ్జలో చల్లగా చలువగా ఉండాలన్నది వారి ఆకాంక్ష.కనుక కూరల్లో ఇబ్బంది పెట్టే ఇకారాలకు తావివ్వరు.కృత్రిమత్వం లేని సహజ రుచులను మనమిక్కడ ఆస్వాదించవచ్చు.పైగా వంట సాధనం కట్టెలపొయ్యి కావడం విశేషం.
27 фев 2024